అమరావతిలోని జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతుల దీక్షలు, అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజధాని గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పెనుమాక, ఎర్రబాలెం, మందడం ప్రాంతాల్లో పర్యటించాలని పవన్ నిర్ణయించుకున్నారు. అయితే, భారీ సంఖ్యలో పోలీసులు జనసేన కార్యాలయం చుట్టూ మోహరించారు. పోలీసుల రాకపై జనసేన పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కార్యకర్తలను పోలీసులు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రాజధానిలో పోలీస్ చట్టం 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నందున వెళ్లొద్దని చెప్పేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, పవన్ బయల్దేరేందుకు కాన్వాయ్ సిద్ధం చేసిన నేపథ్యంలో జనసేన కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.