మూడు వన్డేల సిరీస్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న డిసైడర్ వన్డేలో ఆస్ట్రేలియా 286 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఓపెనర్లు వార్నర్(3), ఆరోన్ ఫించ్(19) విఫలమైనా.. స్టీవ్ స్మిత్ (132 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్తో 131)సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడుగా యువ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్(54) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. భారత బౌలర్లలో షమీకి నాలుగు వికెట్లు తీయగా.. జడేజా రెండు, సైనీ, కుల్దీప్ తలో వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(3), ఆరోన్ ఫించ్(19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. వార్నర్ను పేసర్ మహ్మద్ షమీ క్యాచ్ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన స్మిత్తో సమన్వయం లోపంతో ఫించ్ రనౌటయ్యాడు. దీంతో ఆసీస్ 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో క్రీజులో అడుగుపెట్టిన లబుషేన్తో స్మిత్ బాధ్యాతాయుతంగా ఆడాడు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్లకు 56 రన్స్ చేసింది. మంచి బంతులను ఓపికగా ఎదుర్కొన్న స్మిత్-లబుషేన్ జోడీ.. చెడ్డ బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో 63 బంతుల్లో 8 ఫోర్లతో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఆడుతున్న మూడో వన్డేలోనే లబుషేన్ సాధికారిక ఆటతో ఆకట్టుకున్నాడు. స్మిత్కు చక్కని సహకారం అందించాడు. ఇక బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన ఈ జోడీ.. మంచి స్టోక్స్ షాట్స్తో పరుగులు రాబట్టింది. బౌలర్లు మార్చినా.. ఫీల్డింగ్ జరిపినా.. ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయింది. ఈ దశలో లబుషేన్ 60 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసిన ఆనందంలో మరింత జోరుగా ఆడే ప్రయత్నం చేసిన లబుషేన్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫీల్డింగ్కు క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.దీంతో మూడో వికెట్కు నమోదైన 127 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రవీంద్ర జడేజా వేసిన 32 ఓవర్ మూడో బంతిని లబుషేన్ కవర్ డ్రైవ్ షాట్ ఆడగా... ఫార్వార్డ్ ఫీల్డర్ గా ఉన్న కోహ్లీ అద్భుత డైవ్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో లుబషేన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ వెంటనే అనూహ్యంగా క్రీజలోకి వచ్చిన మిచెల్ స్టార్క్ రెండు బంతులు ఎదుర్కొని.. చివరి బంతికి చహల్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. ఓవైపు వరుస వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు స్మిత్ దూకుడు కొనసాగించాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ(35)తో కలిసి బాధ్యాతాయుతంగా ఆడాడు. అతనితో కలిసి 58 పరుగులు జోడించిన తర్వాత అలెక్స్ను కుల్దీప్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి టర్నర్ రాగా.. స్మిత్ 117 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.