ఆదివారం నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 15 మంది మరణించారు. మరో 17మందికి తీవ్ర గాయాలయ్యాయి. నేపాల్ సింధుపాల్చోక్లోని అరానికో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి 100 మీటర్ల లోతున ఉన్న లోయలోకి పల్టీ కొట్టడంతో ఈప్రమాదం చోటుచేసుకుంది. డోలఖ జిల్లాలోని కలిన్చోక్ నుండి భక్తపూర్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు సన్నటి మలుపు తిరిగే సమయంలో అదుపుతప్పి లోయలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఘటనా స్థలిలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో మరణించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ బస్సును చాలా వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యారు.