వన్డే ప్రపంచకప్ తర్వాత విండీస్ పర్యటనకు వెళ్లిన భారత్.. ఆతిథ్య జట్టును వైట్వాష్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగనున్న తొలి వన్డేలో కూడా కోహ్లీసేన మరోసారి ఫేవరెట్గా కనిపిస్తోంది. మరోవైపు భారత్ చేతిలో తమ పరాజయాల పరంపరకు కళ్లెం వేయాలని వెస్టిండీస్ పట్టుదలతో ఉంది. తొలి మ్యాచ్లోనే గెలిచి భారత్ జోరుకు బ్రేకులేసేందుకు విండీస్ సేన సిద్ధమైంది. తొలి వన్డే మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. సహజంగా చెన్నైలో ఈ నెలలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. దీనికి తగ్గట్టుగానే గత రెండు రోజులుగా తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఈ రోజు కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట. ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. అయితే ఆదివారం వర్షం పడే అవకాశాలు కేవలం 20 శాతం మాత్రమే అని సమాచారం తెలుస్తోంది. గత రెండు రోజులు వర్షం పడటంతో పిచ్ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. చెపాక్ పిచ్ స్లోగా ఉంటూ.. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో ఇరు జట్లు స్పిన్నర్లపైతో బరిలోకి దిగే అవకాశం ఉంది. చివరిసారి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్ను 21 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 9 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడిపోయింది. చాహల్, కుల్దీప్ ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించారు.