మద్రాస్ ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్ ఆత్మహత్య కేసును సిబిఐకి అప్పగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఐఐటీ మద్రాస్లో ఫాతిమా మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రొఫెసర్ల వేధింపులను భరించలేకే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ ఆరోపించారు. ఐఐటీ ప్రొఫెసర్ సుదర్శన్ పద్మనాభన్ కారణమని ఆమె లేఖలో కూడా రాసిందని ఆయన అన్నారు. ఫాతిమాకు తన రోజువారీ కార్యక్రమాలను రాసే అలవాటుందని, అదే విధంగానే తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రొఫెసర్లే కారణమని సెల్ఫోన్లోను, లేఖలో కూడా పేర్కొందన్నారు. ఈ వాస్తవాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరచకపోవడం అనుమానాలకు దారితీసేలా ఉందని లతీఫ్ ఆరోపించారు. ఈ వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టేలా పళని సర్కార్ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నవంబరులో హాస్టల్ గదిలో ఉరివేసుకుని కేరళకు చెందిన ఫాతిమా లతీఫ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది.