ఢిల్లీ నిర్భయ నిందితులను ఉరి తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎప్పుడు ఉరి తీస్తారనే విషయం పై అధికారుల నుండి ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం లేకపోయినా.. తలారి కోసం వెతుకులాట, ఉరి తాళ్లు సిద్ధం చేయడం వంటి పనులన్నీ ఊపందుకున్నాయి. అయితే నిర్భయ నిందితుల ఉరికి సంబంధించి సుప్రీం కోర్టులో సంచలన పిటిషన్ దాఖలైంది.
నిర్భయ నిందితులను ఉరి తీయడాన్ని అన్ని టీవీ ఛానెల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయాలనీ పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాదు అమెరికాలో మాదిరిగా నిందితులను బాధితురాలి తల్లితండ్రుల సమక్షంలో ఉరి తీయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. మరోవైపు నిందితుల ఉరి విషయంలో మరికొన్ని రోజులు జాప్యం జరగనుంది. నిందితుల్లో ఒకడైన అక్షయ్ ఉరిశిక్షపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ నెల 17న దీనిపై విచారణ జరగనుంది. మిగిలిన నిందితులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ లపై గతంలో రివ్యూ పిల్స్ దాఖలు చేయగా వాటిని కోర్టు కొట్టిపారేసింది.