తనను వివాహం చేసుకుంటానని నమ్మించి రూ. 10 లక్షల నగదుతో పాటు ఐదు సవర్ల బంగారు నగలు లూటీ చేసి తన ప్రియురాలు పారిపోయిందని ఓ పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చెన్నైలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలోని పళ్లికరణై ప్రాంతంలో ఉంటున్న బాలచందర్ (39) అనే వ్యక్తి ముంబై, దుబాయ్ ప్రాంతాల్లో గ్లోబల్ టచ్ పేరుతో అనేక కంపెనీలు నిర్వహిస్తున్నాడు. బాలచందర్ భార్య 2015 లో మరణించగా ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కొన్ని నెలల క్రితం చెన్నైలోని బాలచందర్ కార్యాలయానికి వచ్చిన ఓ మహిళ తనను తాను మయూర వర్షిణి (38)గా పరిచయం చేసుకుంది. తన సొంత ఊరు బెంగుళూరు అని, తాను మాజీ పంచాయతీ అధ్యక్షురాలినని తెలిపింది. అదే నెలలో బాలచందర్ కంపెనీలో మయూర వర్షిణి ఉద్యోగానికి చేరింది. ఆ సమయంలోనే బాలచందర్ ను ఆమె ట్రాప్ చేసింది. తనకు నచ్చిన వాడు దొరకకపోవడంతో తాను ఇంకా పెళ్లి చేసుకోలేదని, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని, మీ ఇద్దరు పిల్లలను బాగా చూసుకుంటానని బాలచందర్ ను నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన బాలచందర్ పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు. ఇద్దరూ కలిసి సినిమాలు షికార్లు అంటూ విచ్చలవిడిగా తిరిగారు.
పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చిన ప్రతిసారి.. తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని అవి తీరగానే పెళ్లిచేసుకుందామని చెపుతూ వచ్చింది. తీరా చూస్తే బాలచందర్ వద్ద నగలు, డబ్బు తీసుకుని ఉడాయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను నిలువు దోపిడీ చేసిందని బాలచందర్ పోలీసుల వద్ద గొల్లుమన్నారు. కేసు నమోదు చేసుకున్నచెన్నై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.