అమరావతి : అసెంబ్లీలో మార్షల్పై టీడీపీ సభ్యులు దుర్భాషలాడారని, వారిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి పేర్ని నాని స్పీకర్ ను కోరారు. శుక్రవారం మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆవరణలో గురువారం టీడీపీ సభ్యుల తీరు బాధ కలిగించిందని మంత్రి తెలిపారు. సభ్యులు కానివారిని లోనికి అనుమతించరని టీడీపీ సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు. గౌరవ సభ్యులు సభలో హుందాగా వ్యవహరించాలని కోరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మెప్పుకోసం టీడీపీ సభ్యులు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. మార్షల్స్పై దుర్భాషలాడిన టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.