శ్రీవారి లడ్డూ ప్రసాదాలు తయారుచేసే పోటు కార్మికులతో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి గురువారం తిరుమలలోని వైభవోత్సవ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పోటు కార్మికులు భక్తిశ్రద్ధలతో విధులు నిర్వహించాలని కోరారు. మానవ తప్పిదాలతో బూందీ పోటులో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముందన్నారు. అగ్ని ప్రమాదాలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. అగ్నిమాపక విభాగం, ఆరోగ్య విభాగం, ఆలయ అధికారులు అందించిన సూచనలతో ఒక నిర్దిష్టమైన విధానాన్ని రూపొందిస్తామని, పోటు కార్మికులు ప్రతి ఒక్కరూ ఈ విధానాన్ని పాటించాలని కోరారు.