భారత మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లో శనివారం నిర్వహించిన పాసింగ్ పెరేడ్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సమీక్షించారు. శనివారం నియామకమైన యువ జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ సేవాధర్మం, శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటాలని అయినా పొరుగునున్న పాకిస్థాన్ వంటి దేశాల తో తలపడడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అనేకసార్లు భారత్తో యుద్దానికి తలపడి పాక్ ఓటమి చెందినప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే తన పాలనా విధానంగా కొనసాగిస్తోందని విమర్శించారు. ముంబై దాడులు, అమెరికా దాడుల సూత్రధారులు, నేరస్థులు పాక్ లోని ఉన్నారని, వారిని పాక్ పట్టి అప్పగించినప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. మిలిటరీ అకాడమీలో శిక్షణ పొందిన కొత్తవారు మెళకువలను నేర్చుకోవాలని అప్పుడే సైబర్ ఉగ్రవాదం నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించ గలరని సూచించారు. చారిత్రక చెట్వోడే భవనం నేపథ్యంలో సాగిన పెరేడ్లో అభ్యర్ధుల రంగురంగుల డ్రిల్ను సందర్శించి ఉత్తర, దక్షిణ, మధ్య కేంపస్లను కలుపుతూ భూగర్భ మార్గాల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. డెహ్రాడూన్ నుంచి పొరుగునున్న హిమాచల్ ప్రదేశ్, హర్యానాలకు వెళ్లడానికి ఈ మార్గాలు ఉపయోగపడతాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు రూ. 30కోట్లు మం జూరయ్యాయని చెప్పారు. మిత్రదేశాల నుంచి 71 మంది అభ్యర్థులతోపాటు మొత్తం 377 మందిని సైన్యంలో చేర్చుకున్నారు. 56 మంది శిక్షణాభ్యర్థులతో ఉత్తర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండగా, 39 మందితో హర్యానా, 24 మందితో బీహార్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. అకాడమీ విశిష్ట గుర్తింపుగా ఖడ్గ బహూకరణ, బంగారు పతకం అకాడమీకి చెందిన అధికారి వినయ్ విలాస్ గెరాడ్కు మంత్రి రాజ్నాధ్ బహూకరించారు. మరో సీనియర్ అధికారి పీకేంద్ర సింగ్కు రజత పతకం, కంచుపతకం బెటాలియన్ అధికారి ధ్రువ్ మెహ్లాకు బహూకరించారు.