జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఏమిటనే అంశం పై ఈ మధ్య ఆయన చేసిన వ్యాఖ్యలతో కొంత క్లారిటీ వచ్చింది. తాను బీజేపీకి ఎఫ్పుడూ దూరంగా లేనని పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడంతో.. ఆయన త్వరలోనే ఆ పార్టీకి దగ్గర కాబోతున్నాడనే చర్చ జోరందుకుంది. అమిత్ షాను పొగిడిన మరుసటి రోజే... బీజేపీకి అనుకూలంగా మరిన్ని వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్, బీజేపీ ఒక్కటవుతారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై బీజేపీ నేతల రియాక్షన్ మాత్రం కాస్త భిన్నంగా ఉంది. పవన్ కళ్యాణ్ తమకు దగ్గరైతే మంచిదే అన్న బీజేపీ నేతలు... జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని వ్యాఖ్యానించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్, బీజేపీ మధ్య జనసేన అడ్డుగా ఉందనే వాదన కూడా రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. బీజేపీతో కలిసి పని చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తుంటే... బీజేపీ మాత్రం ఇందుకు నో అంటోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తమతో కలిసి పని చేయాలని భావిస్తే... కచ్చితంగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాల్సిందే అని పార్టీ నేతలు షరతు విధించినట్టు సమాచారం.
బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారని... కానీ బీజేపీ మాత్రం జనసేనను తమ పార్టీలో విలీనం చేస్తేనే కలిసి పని చేసేందుకు సిద్ధమని పవన్ కళ్యాణ్కు క్లారిటీ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీలో క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ధీటుగా ఎదగాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్... బీజేపీతో కలిసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.