కొద్ది నెలల క్రితం ఒక మహిళపై అత్యాచారినిక పాల్పడిన నిందితులు బెయిల్పై విడుదలై బాధితురాలికి నిప్పంటించి హతమార్చేందుకు ప్రయత్నించారు. గురువారం ఉదయం ఉన్నావ్ గ్రామ శివారుల్లో ఈ ఘోరం జరిగింది. 80 శాతం శరీరం కాలిపోయిన ఆమెను లక్నోలోని కెజిఎంయు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం అత్యాచారానికి గురైన ఆమె ఈ ఏడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరయ్యేందుకు గురువారం రాయబరేలికి వెళుతున్న ఆమెను ప్రధాన నిందితుడితోసహా ఐదుగురు నిందితులు పొలాల్లో అడ్డగించి ఆమెకు నిప్పంటించారు. నిందితులలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ప్రధాన నిందితుడు మాత్రం తప్పించుకుని పారిపోయాడు.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే బాధిత మహిళ, ప్రధాన నిందితుడు గత ఏడాది పెద్దల అభిమతానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారు. అయితే వారి సంబంధాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో వారిద్దరూ విడిపోయారు. కాగా, ఈ దారుణ సంఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. యుపిలో శాంతి భద్రతల పరిస్థితి బాగుందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసత్యాలు చెబుతున్నారని, కాని రోజు ఇటువంటి వార్తలు విని హృదయం రగిలిపోతోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఉదంతం మరువకముందే ఉన్నావ్లో అత్యాచార బాధితురాలిని నిందితులు నిప్పంటించి హతమార్చడానికి ప్రయత్నించడం సంచలనం రేపుతోంది.