ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను తీర్చడానికి సబ్సిడీపై 25 రూపాయలకే కేజీ ఉల్లిపాయలను అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 14 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఏపీ మార్కెటింగ్ మరియు మత్స్య శాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ, రైతు బజార్ల ద్వారా పట్టణాల్లోని వినియోగ దారులకు సబ్సిడీపై రూ.25కే కేజీ ఉల్లిని సరఫరా చేస్తున్నామని, ఇందు కోసం మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తగినంత స్టాక్ అందుబాటులో లేదని, అందుకే గ్రామాలలో రేషన్ షాపుల ద్వారా ఉల్లిని పంపిణీ చేయలేకపోతున్నామని చెప్పారు. ఈరోజు కూడా మహారాష్ట్రలోని షోలాపూర్ మార్కెట్లో 115 రూపాయలు ధరకు మన అధికారులు ఉల్లిని కొనుగోలు చేశారని, అయినప్పటికీ తగినంత దొరకలేదు అన్నారు.