ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఇసుక అక్రమ నిల్వలు, అధిక ధరల విక్రయాలు ఉన్నా ఈ నంబరుకు ఫోను చేసి ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. ఈ టోల్ ఫ్రీ నంబరును ప్రారంభించిన వెంటనే జగన్, కాల్ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. కాల్ సెంటర్ ఉద్యోగులకు జగన్ పలు సూచనలు చేసి, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, టాస్క్ఫోర్స్ చీఫ్ సురేంద్ర బాబు కూడా ఈ టోల్ ఫ్రీ నంబరు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.