ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత యువ క్రీడాకారిణి కాల్చివేత...

national |  Suryaa Desk  | Published : Tue, Nov 12, 2019, 07:54 PM

హరియాణాలోని గురుగ్రామ్‌లో 25 ఏళ్ల భారత యువ క్రీడాకారిణి కాల్చివేతకు గురైంది. తైక్వాండో క్రీడాకారిణి సరిత మంగళవారం మధ్యాహ్నం హత్య చేయబడింది. ఒక యువకుడు సరితను కాల్చి చంపాడని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ హత్య వెనుక సరిత కోచ్ హస్తం ఉందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 'సరిత కోచ్ ఆమెను వివాహం చేసుకోవాలని పలుమార్లు వెంటపడ్డాడు. పెళ్లికి సరిత చాలాసార్లు తిరస్కరించింది. అయినా కోచ్ వేధింపులు ఆపలేదు. పెళ్లి విషయమై కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. పెళ్లికి నిరాకరించడంతోనే కోచ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు' అని సరిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురుగ్రామ్‌లోని బోరాఖుర్ద్ గ్రామంలో ఓ యువతి కాల్చివేతకు గురైనట్టు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను తైక్వాండో క్రీడాకారిణి సరితగా గుర్తించారు. ఒక యువకుడు మహిళను కాల్చి చంపి పరారైనట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. సరిత హత్య వెనుక ఆమె కోచేనని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కోచ్.. సరితకు 2013 నుంచి తెలుసని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే హత్య తర్వాత కోచ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com