విజయవాడ వాసులకు స్పైస్ జెట్ విమానాయాన సంస్థ షాక్ ఇచ్చింది. విజయవాడ నుంచి ముంబైకి నిత్యం నడిచే సర్వీసును స్పైస్ జెట్ ఉపసంహరించుకుంది. సుమారు 85 శాతం మేరకు ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, విజయవాడ నుంచి ముంబైకి నిత్యం నడిచే సర్వీసును స్పైస్ జెట్ రద్దు చేసింది. ప్రతిరోజూ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఈ విమానం బయలుదేరేది. చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ సర్వీసును వాడుకునేవారు. ఇప్పుడు ఒక్కసారిగా దీన్ని రద్దు చేయడంతో, ఇకపై విజయవాడ నుంచి ముంబైకి వారంలో మూడు రోజులు మాత్రమే డైరెక్ట ఫ్లయిట్ సర్వీస్ నడవనుంది. 140 సీట్లు ఉన్న విమానాన్ని సంస్థ నడపగా, రోజూ 100 మందికి పైగానే ప్రయాణికులు దీనిలో ప్రయాణించేవారు. మంచి ఆక్యుపెన్సీ ఉన్నప్పటికీ, ఇలా విమాన సర్వీసును రద్దు చేయడంపై ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇక రద్దయిన సర్వీసును రాజ్ కోట్ కు కేటాయించినట్టు స్పైస్ జెట్ వెల్లడించింది.