విజయవాడలోని భవానీపురంలో దారుణం జరిగింది. ఆదివారం అదృశ్యమైన ఎనిమిదేళ్ల బాలిక మొవ్వ ద్వారక దారుణ హత్యకు గురైంది. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ద్వారకను పక్క ఇంట్లోనే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో గోనె సంచిలో చిన్నారి మృతదేహం కనిపించింది. వాస్తవానికి ఆమె తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లినట్లు భావించిన పోలీసులు.. ఈ రోజు ఉదయం కిడ్నాప్కు గురై ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే.. పక్క ఇంటి వ్యక్తి మేకల ప్రకాశ్ అనే వ్యక్తి ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని ఓ సంచిలో గుర్తించారు. అతడే ఆ బాలికను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.