హైదరాబాద్: సమ్మెలో భాగంగా ఆర్టీసీ సిబ్బంది ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ప్రవర్తిస్తున్నారని పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లపై దాడులకు దిగి బస్సుల ధ్వంసానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్ హెచ్చరించారు. ఇటీవల ఇలాంటి చట్ట వ్యతిరేక సంఘటనలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడంతోపాటు వారి చర్యలపై ఆర్టీసీ యాజమాన్యానికి పూర్తి నివేదిక ఇచ్చామని పోలీసు కమిషనర్లు తెలిపారు. వారిపై నమోదైన కేసుల దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సమ్మెను శాంతియుతంగా జరుపుకోవాలని, చట్టవిరుద్ధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు బాసులు కార్మికులను హెచ్చరిస్తున్నారు.