నెల రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్దమునిగిపోయిన బోటు రాయల్ వశిష్ట బోటు వెలికితీత కార్యక్రమాలు మళ్లీ జోరందుకున్నాయి. గోదావరి నదిలో వరద ఉదృతి పెరుగుతుండటంతో రెండు వారాలుగా ఈ వెలికితీత పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో బోటు వెలికితీత పనులు తిరిగి ప్రారంభించారు.గజ ఈతగాళ్లు గోదావరి నదీగర్భంలోకి వెళ్లి లంగరును బోటుకు తగిలించే విషయమై ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈతగాళ్లు అంగీకరిస్తే ఈ పద్ధతిలో, లేకపోతే ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంలోనే వెలికితీత కార్యక్రమాలు కొనసాగిస్తామని ధర్మాడి సత్యం గ్రూప్ స్పష్టం చేసింది.
ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి దాదాపు 500 మీటర్ల దూరం వరకు బోటు కొట్టుకుపోయిందని, నీటిలో వదిలిన లంగరుకు బోటు తగిలినట్లు సత్యం బృందం చెప్తున్నారు. అయితే ఇనుప రోప్ ను ప్రొక్లెయిన్ కు కట్టి లాగడం వలన లంగరు అందులోనే జారిపోయింది. బోట్ అదే ప్రదేశంలో ఉన్నట్లు నిర్ధారించేలా మునిగిపోయిన బోటుకు సంబంధించి తెల్లటి పెయింట్ పైకి తేలటంతో బోటు ఉన్న చోటును గుర్తించినట్లు ధర్మాడి సత్యం బృందం మీడియాకు వెల్లడించింది.
సెప్టెంబర్ 15న చోటుచేసుకున్న ఈఘటనలో ఇంకా 15 మంది పర్యాటకుల ఆచూకీ లభించాల్సి ఉంది.