ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపి క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన మంత్రివర్గ సమావేశంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి
వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ .10,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. మరబోట్లే కాకుండా తెప్పలపై కూడా వేట సాగించే జాలర్లకు ఈ ఆర్థిక సహాయం వర్తించబడుతుంది.
మత్యకారులకు డీజిల్పై లీటరుకు రూ .9 సబ్సిడీని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 21న మత్స్య దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఆ రోజు నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి నాని తెలిపారు.
రాష్ట్రంలో హోమ్ గార్డ్ కార్మికుల వేతనాల పెంపుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హోమ్ గార్డుల రోజువారీ జీతం రూ. 600 నుండి రూ.710 కి పెంచారు. దీంతో హోం గార్డుల వేతనం నెలకు రూ. 18,000 నుండి రూ. 21,300 కు చేరుతుంది.
మధ్యాహ్న భోజనం పథకం కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం రూ. 1000 నుండి రూ. 3000 కు పెంచుతూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
బార్ అసోసియేషన్ లో సభ్యులుగా ఉన్న జూనియర్ న్యాయవాదులకు 5 వేల ప్రోత్సాహకాలు అందించాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
జిల్లాల వారీగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు డ్రిల్లింగ్ మిషన్ల కొనుగోళ్లకు కేబినేట్ నిర్ణయం తీసుకుంది.
ఏపీఎస్ ఆర్టీసీలో కాలం చెల్లిన 3500 పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఏపి కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ, 1000 కోట్ల వరకు రుణం తీసుకునేలా ఆర్టీసీకి అనుమతులు మంజూరు చేసింది.