పశ్చిమగోదావరి జిల్లా కవిటంలో దారుణం జరిగింది. ప్రేమించలేదనే కారణంతో ఓ యువతి పై ప్రేమోన్మాది సుధాకర్ కత్తితో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన యువతి వెంట సుధాకర్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాడు. సుధాకర్ కు ఇది వరకే వివాహమైంది. యువతి సుధాకర్ ప్రేమను తిరస్కరించింది. అయినా సుధాకర్ ఆమెను వేధించడం ఆపలేదు. బుధవారం ఉదయం కళాశాలకు వెళ్లేందుకు యువతి కవిటం బస్టాండ్ వద్దకు చేరుకుంది. అదే సమయానికి సుధాకర్ అక్కడికి చేరుకొని కత్తితో యువతి పై విచక్షణ రహితంగా దాడి చేశాడు. పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా సుధాకర్ కత్తి చూపించి వారిని బెదిరించాడు. ఆ తర్వాత వెంటనే సుధాకర్ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.