అమరావతి : సీఎం వైఎస్ జగన్ తాజా ప్రకటనపై కన్నా హర్షం. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరులో ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వేదికైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమాన్ని వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా మొన్నటి వరకూ జగన్ సర్కార్ అలా చేయలేదు.. ఇలా చేయలేదు అని విమర్శలు గుప్పించిన కన్నా.. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
కన్నా ట్వీట్ సారాంశం ఇదీ
‘మోదీ గారు రైతులకు అందించే కేంద్ర నిధులు రూ.6000 కు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి "YSR రైతు భరోసా-PM కిసాన్"గా ఇవ్వడం హర్షణీయం.. గత సర్కారులా కాక ఇకపై కేంద్రం నిధులతో ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి పేరు తప్పనిసరిగా జత చేసి లబ్ధిదారులకు అందచేయాలి’ అని కన్నా ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే.. పంటల సాగుకు పెట్టుబడిగా ఐదేళ్లపాటు ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో ఈ పథకం కింద రూ.12,500 చెల్లిస్తామని తొలుత ప్రకటించగా ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.13,500కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తాన్ని ఏటా మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నది. అక్టోబరులో రబీ సాగు సమయంలో రూ.4వేలు, సంక్రాంతికి రూ.2వేలు, మే నెలలో ఖరీఫ్ సాగు సమయంలో రూ.7,500 జమ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.