కర్నూలు జిల్లా, పత్తికొండలోని టమాటా రైతులు రోడ్డెక్కారు. పంట దిగుబడి కొనుగోళ్లలో వ్యాపారులు దోపిడీకి తెర లేపడంతో కడుపుమండి ఆందోళనకు దిగారు. పత్తికొండలోని ఓ ప్రైవేటు స్థలంలో టమాటా దిగుబడులను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 25కిలోల జత గంపలు రూ.600 ధర పలికాయి. సాయంత్రానికి వ్యాపారులు వీటి ధరను రూ.150కి తగ్గించారు. అదేమని రైతులు నిలదీయడంతో కొనుగోళ్లు నిలిపేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు గుత్తి-పత్తికొండ రహదారిపై బైఠాయించారు. పత్తికొండ సీఐ నరే్షబాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా శాంతించలేదు. చివరకు ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు బలవంతంగా పక్కకు లాగేశారు. టమాటా కొనుగోళ్లలో వ్యాపారుల తీరుపై మూడు రోజుల క్రితం కూడా రైతులు రోడ్డెక్కారు. అప్పుడు దాదాపు నాలుగు గంటల పాటు వారు ఆందోళన చేయడంతో పత్తికొండ- ఆదోని రహదారిపై రాకపోకలు స్తంభించాయి. జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తరువాత అధికారులు పట్టించుకోలేదు. వ్యాపారుల దోపిడీ ఆగలేదు. దీంతో రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు.