దసరా సీజన్లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) భారీగా ఆదాయం ఆర్జించింది. ఈ సీజన్లో మొత్తం రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది దసరా సీజన్ కంటే ఈ సారి రూ.20 కోట్లు అధికంగా రావడం గమనార్హం. 2018 దసరా సమయంలో రూ.209 కోట్లు, ఈసారి రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పండక్కి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) ఏకంగా 103 శాతంగా నమోదైంది.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులకు ఆదరణ మరింత పెరిగింది. మొత్తం పండగ సీజన్లో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 5,887 ప్రత్యేక బస్సులను తిప్పిన ఏపీఎస్ఆర్టీసీ గణనీయమైన ఆదాయాన్ని రాబట్టింది. ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసి.. ప్రణాళికాబద్ధంగా సర్వీసులు నడపడంతో మంచి రాబడి లభించింది. ఏపీఎస్ఆర్టీసీకి ప్రతిరోజూ సాధారణంగా రూ.13 కోట్ల ఆదాయం ఛార్జీల రూపంలో వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 71 లక్షల మంది ప్రయాణిస్తారు.