ఎగువ రాష్ట్రాలతో పాటు రాయలసీమలో సైతం కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం డ్యామ్ చరిత్రలో మొదటిసారి ఈ ఏడాది ఆరు సార్లు జలాశయం క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినట్లు జలాశయం అధికారులు తెలుపుతున్నారు. దీంతో ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శ్రీశైలం జలాశయం సరికొత్త రికార్డు సృష్టించిందనే చెప్పాలి.కృష్ణ,తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహించడంతో శ్రీశైలం జలాశయం పరిధిలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకున్నాయని దీంతో కేవలం రోజుల వ్యవధిలో ఆరు సార్లు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీశైలం డ్యాం చరిత్రలోనే ఒకే సంవత్సరంలో ఆరు సార్లు డామ్ గేట్లను ఎత్తి దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. డ్యామ్ చరిత్రలో తొలిసారిగా ఆరు సార్లు జలాశయం నుండి మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను పది అడుగుల మేరకు ఎత్తివేసి 84,225 క్యూసెక్కుల వరదనీటిని కిందకు విడుదల చేసినట్లు తెలిపారు.