పెరటాసి మాసంలో దసరా పర్వదినం తరువాత వరుసగా రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో శుక్రవారం నుండి తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. దాదాపు 1800 మంది శ్రీవారి సేవకులు భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణగిరి ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాల్లోని క్యూ లైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2లో, ఫుడ్ కౌంటర్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగ, పాలు, అన్నప్రసాదాలను శ్రీవారి సేవకులు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా యాత్రికుల సంక్షేమ సౌకర్యాల సేవకులు(పిడబ్ల్యుఎఫ్ఎస్) వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్నప్రసాదం, వైద్యం, పారిశుద్ధ్యం, శ్రీవారి ఆలయం, విజిలెన్స్ తదితర విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు సత్వర సేవలు అందిస్తున్నారు.