అనంతపురం జిల్లా గుత్తిలోని తురకపల్లిలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కారణంతో అరుణ కుమారి(18) అనే యువతిని రంగస్వామి అనే యువకుడు గొంతు నులిమి హత్య చేశాడని పోలీస్ విచారణలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గుత్తిలోని తురకపల్లి కాలనీలో నివాసం ఉండే కారు డ్రైవర్ రాజు కుమార్తె మేరీ అరుణ కుమారి(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. రంగస్వామి అనే యువకుడు కొంతకాలంగా ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో శనివారం సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించగా ఓ డ్రైనేజీ సమీపంలో అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందిందని పోలీసులు నిర్దారించారు. మృతదేహంపై ఉన్న గాయాలు అనుమానం రేకెత్తించాయి. దీంతో హత్య కోణంలో దర్యాప్తు చేయగా.. రంగస్వామి గురించి తెలిసింది. రంగస్వామిని పట్టుకుని విచారించగా.. అతనే గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. తన ప్రేమను నిరాకరించినందుకే రంగస్వామి ఆమెను హత్య చేసినట్టు నిర్దారించారు. దీంతో ఆదివారం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు.