తన మాట వినలేదన్న అక్కసుతో సొంత తండ్రినే దారుణంగా నరికి చంపారు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మడివి బుచ్చయ్య (48).. తన ఇద్దరు కుమారులు సోమయ్య, సన్యాసిరావులతో కలిసి నివసిస్తున్నాడు. నెల రోజుల నుంచి పొలానికి సంబందించిన విషయాలలో తండ్రీ కుమారుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. బుచ్చయ్య కొడుకులు సన్యాసిరావు,సోమయ్య భూమిని తమకు పంచమని.. లేదా అమ్మేయాలని కొంతకాలంగా తండ్రితో గొడవపడుతున్నారు. ఇదే క్రమంలో మంగళవారం కూడా ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన అన్నాదమ్ముళ్లు.. తండ్రిపై చేయి చేసుకున్నారు. ఇంతలో సన్యాసిరావు తండ్రిని కదలకుండా గట్టిగా పట్టుకోగా.. సోమయ్య గొడ్డలి తీసుకొచ్చి అతని వీపుపై నరికాడు. దీంతో బుచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.