తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళుతున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా చిన్నారితో సహా 5 గురికి తీవ్ర గాయాలైనట్లు హైవే పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మామిడూరు గ్రామానికి చెందిన చరుమూరి రామస్వామి (65), సూర్య పార్వతి(50), సురేష్(35), సునీత(30), కారుణ్య(5), రమ్య (28) ఒకే కుటుంబ సభ్యులు మారుతి జెన్ కారులో పెద్దాపురం శుభ కార్యంలో పాల్గొని రావులపాలెం వైపు వస్తుండగా మడికి పెట్రోల్ బంక్ సమీపంలో ఆగి ఉన్న లారీను ఢీకొట్టింది. ఈఘటనలో తండ్రి కారులోనే మృతి చెందగా డ్రైవింగ్ చేస్తున్న అతని కుమారుడు కోడలు భార్యతో పాటు మరో చిన్నారి అతని సోదరుని కుమార్తె లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్ పై రాజమండ్రి తరలించారు.