తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో మద్యం షాపు ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగ్గంపేట కోనేటి వీధిలో ఏర్పాటు చేయబోతున్న మద్యం దుకాణం ఆపాలంటూ మూడవరోజు నిరసన దీక్ష తీవ్రతరమైంది. స్థానిక రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు, జిల్లా కార్యదర్శి బి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు , మూడు రోజులుగా మద్యం దుకాణంకు మద్యం బాటిల్స్ రాకుండా నియంత్రణ చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా కాపలా కాశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. నిరసన శిబిరాన్ని సందర్శించి ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ జగ్గంపేటలో మూడు మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెండు షాపులు గ్రామానికి దూరంగా ఉండటం వల్ల ప్రజావ్యతిరేకత లేదన్నారు. కోనేటి వీధిలో మహిళలు స్థానికులు దుకాణం ఏర్పాటు పై వ్యతిరేకత తెలియజేయడం సమంజసమని అన్నారు. నివాసప్రాంతాలలో మందుబాబుల ఆగడాలు స్థానికులకు ఇబ్బందికరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు ప్రజాకంటం గా తయారయ్యాయన్నారు. మద్యాన్ని అంచెలంచెలుగా ప్రజలకు దూరం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. మూడవ మద్యం దుకాణాలను ప్రజల కోరిక మేరకు మార్చాలని డిమాండ్ చేశారు. ఈమేరకు పోన్ ద్వారా ఎక్సైజ్ అధికారులతోను , జిల్లా కలెక్టర్ తోను విషయాన్ని వివరించారు. తక్షణమే ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి మద్యం దుకాణం వేరే స్థలానికి మార్చాలని కోరారు .ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ తో పాటు పార్టీ నాయకులు ఎస్ వి యస్ అప్పలరాజు, మండల పార్టీ నాయకులు ఎం భద్రం ,జీను మణిబాబు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.