ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ నేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2019, 12:54 PM

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యుల జాబితాను వైఎస్ జగన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి పలువురు ప్రముఖులకు టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం అవకాశమిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పాలకమండలి ఇష్టానుసారం ఏకపక్షంగా వ్యవహారిస్తూ వివాదాస్పద నిర్ణయాలను తీసుకుంటోందన్నారు. పాలకమండలిలోని ప్రత్యేక ఆహ్వానితులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదని చట్టాలు చెబుతున్నాయన్నారు.


గతంలో వున్న ప్రత్యేక ఆహ్వానితులు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదని.. ఎవరి ఆదేశం మేరకు వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారో పాలకమండలి, టీటీడీ అధికారులు భక్తులకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీవారి నిధులను కేవలం ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలని యాక్ట్ 30 ఆఫ్ 1987 చెబుతున్నప్పటికీ.. వీళ్లు మాత్రం ఇష్టానుసారం నిధులను మళ్ళించడం దారుణమన్నారు. అవిలాల చెరువు, గరుడ వారధి పనులకు తాము వ్యతిరేకం కాదని.. టీటీడీ నిధులను మాత్రం వీటికి వినియోగించడాన్ని ఒప్పుకోమన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వం, పాలకమండలి స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తానని భానుప్రకాష్ రెడ్డి తేల్చిచెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com