జగన్ జైల్లో ఉండగా పార్టీని కాపాడటంతో పాటు జగన్ సిఎం కావాలని అఖండ పాదయాత్ర చేసిన ఆతని సోదరి షర్మిలకు పార్టీలో పదవి ఇవ్వాలన్న డిమాండు ఊపందుకొంటోంది. గత ఎన్నికల ముందు మీ కోసం జగనన్న వస్తాడు. రాజన్న రాజ్యం తెస్తాడు అంటూ అప్పటి ప్రభుత్వంపై విసుర్లు ఇప్పటికే కార్యకర్తల మదిలో మారుమ్రోగుతునే ఉంటాయి. ఇక పార్టీ కోసం ఆయె పలు పర్యాయాలు జనం ముంగిటకు వచ్చిన క్రమాన్ని కూడా కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. వివిధ పార్టీలలో ఉండి ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారు పదవులు అనుభవిస్తున్నారని, పార్టీలో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా తనదైన శైలిలో వ్యవహరించి పార్టీని అధికారం దిశగా నడిపించిన షర్మిల పదవికి అర్హురాలన్నది వారి వాదన. నిజానికి జగన్ సిఎం అయ్యాక షర్మిలకు కేబినెట్ స్థాయి పదవి ఏదో ఒకటి రావటం ఖాయమన్న వార్తలు వచ్చినా, తను పదవిపై ఆసక్తి చూపనని, తన సోదరుడు సిఎం అయ్యాడు అంతే చాలంటూ ప్రకటించారు. కాగా ప్రస్తుత పరిస్థితిలో పార్టీ వ్యవహారాలను చూసుకునేందుకు నమ్మదగిన వ్యక్తి షర్మిల మాత్రమేనని భావిస్తున్న జగన్ ఆమెకు తగిన పదవి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే జగన్ తల్లి వైసిపికి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విషయం విదితమే.