సముద్రతీరం తీరం కలిగిన వివిధ రాష్ట్రాలు సముద్రం నుండి ఎదురయ్యే ముప్పు, తీరప్రాంత భద్రతపై నిరంతరం అప్రమత్తతతో ఉండాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబఆదేశించారు. “నేషనల్ కమిటీ ఆన్ స్ట్రెంథనింగ్ మారిటైమ్ అండ్ కోస్టల్ సెక్యురిటీ ఎగెన్నెస్ట్ ధ్రెట్స్ ప్రమ్ సీ” పై ఈ మేరకు సోమవారం ఢిల్లీ నుండి దేశంలోని వివిధ తీరప్రాంత రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట సాగించే వివిధ మోటరైజ్డ్ బోటులు, ఇతర రకాల బోటుల నియంత్రణను సంబంధిత శాఖలు పటిష్ట నిఘాతో పర్యవేక్షించాలని చెప్పారు. అలాంటి బోటుల ద్వారా చేపలవేట సాగించే మత్స్యకారులందరికీ బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు జారీ చేయాలని స్పష్టం చేశారు. తీరప్రాంత రక్షణ దళం, నౌకాదళం, రాష్ట్ర పోలీస్, స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు సముద్ర తీర భద్రత విషయంలో పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తీరప్రాంత రాష్ట్రాలన్నీ మారిటైమ్ బోర్డులను ఏర్పాటు చేసి నిరంతరం సముద్రం నుండి ఎదురయ్యే ముప్పు సమర్థవతంగా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్రాలను ఆదేశించారు. అంతకుముందు కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సముద్రంలో చేపలవేట సాగించే బోటులకు సాటిలైట్ బేస్డ్ ట్రాన్సుఫాండర్లు ఏర్పాటు, సముద్రంపై జరిగే నేరాల నియంత్రణలో నేవీ, తీరప్రాంత రక్షణ దళాలు చేపట్టాల్సిన పరిష్కార మార్గాలపై దిశానిర్దేశం చేశారు. అదే విధంగా సుముద్రంలో చేపలవేట సాగించే మత్స్యకారులందరికీ బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు జారీ, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక వద్ద నేషనల్ ఎకాడమీ ఆఫ్ కోస్టల్ పోలీసింగ్ కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. అంతేగాక తీరప్రాంత రాష్ట్రాల్లో స్టేట్ మారిటైమ్ బోర్డులు ఏర్పాటు, మెర్కంట్ షిప్పింగ్ చట్టంలో సవరణలు, మత్స్యకారులు సముద్రంలో వేటకై ప్రవేశించే మార్గాలు, నిష్క్రమణ పాయింట్లు, గత జనవరిలో భారత రక్షణశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ (సీవిజిల్) తదితర అంశాలపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించారు. వీసీనోలో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే మారిటైమ్ బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ బోర్డును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా భద్రతా దళాలకు చెందిన కొంతమందిని సభ్యులుగా తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే తీర ప్రాంత రక్షణలో భాగంగా రాష్ట్రానికి మొదటి విడతగా 18 ఇంటర్ సెప్టర్ బోటులను కేటాయించారని వాటికి వార్షిక మరమ్మత్తులు అవసరం ఉందని కావున వీటి నిర్వహణను విశాఖపట్నంలోని తూర్పు నావికాదళానికి అప్పగించాలని కేబినెట్ కార్యదర్శి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్, అదనపు డిజిపి శాంతి భద్రతలు రవిశంకర్ అయ్యన్నార్, రాష్ట్ర తీరప్రాంత ఐజి ఎఎస్ ఖాన్, డీఎస్పీ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.