ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న ‘అమృత భూమి’ సినిమాలో టీచర్ పాత్రలో డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్పశ్రీవాణి, అధికారి పాత్రలో కలెక్టర్ హరిజవహర్లాల్ నటించారు. మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడ గ్రామంలో నిర్వహించిన సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. గొరడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలిగా డిప్యూటీ సీఎంపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా నిర్మించడం ఆనందదాయకమన్నారు. నటుడు రాజాప్రసాద్ బాబు మాట్లాడుతూ రోజు రోజుకీ అటవీప్రాంతం అంతరించి పోతోందని, తినే తిండి గింజల నుంచి కట్టుకునే బట్ట వరకు అంతా రసాయనాలతో నిండిపోతుందని చెప్పారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యపర్చేందుకు ఈ చిత్రాన్ని రూపొం దిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారుడు వండపండు, జట్టు వ్యవస్థాపకులు డి.పారినాయుడు పాల్గొన్నారు.