కడప జిల్లాలోని చింతకొమ్మదిన్నె మండలంలో గూడవల్లపల్లె గ్రామానికి చెందిన రైతు సుబ్బరాయుడు పొలం భూమి కుంగింది. పొలంలో సుమారు 8 అడుగుల వెడల్పు, 25 అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. గతేడాది కూడా పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. గత నాలుగు రోజులుగా పొలాల్లో అక్కడక్కడ గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. ఈ విధంగా ఎందుకు జరుగుతుందో తెలియడంలేదని, అధికారులు కూడా పరిష్కారం చూపడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల నుంచి ఇలాగే జరుగుతుందని అన్నారు. దీనిపై పంచాయితీలో పెట్టినా పట్టించుకునే నాథుడులేడని రైతులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు గుంతలు ఎందుకు ఏర్పడుతున్నాయో పరిశీలించి పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.