రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ పిలుపుమేరకు తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు సోమవారం నుంచి బహిష్కరించారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ హైకోర్టు రాజధాని ప్రాంతంలోనే కొనసాగించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు బహిష్కరిస్తున్నట్లు బార్ ప్రెసిడెంట్ కె సునీల్ కుమార్ తెలిపారు. పశ్చిమగోదావరిజిల్లా, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల బార్ అసోసియేషన్లు ఒక జేఏసీగా ఏర్పాటు అయినట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఒక వినతిపత్రం కూడా ఇచ్చినట్లు వారు చెప్పారు. రాష్ట్ర హైకోర్టు రాజధాని ప్రాంతం లోనే ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయవాదులు నినాదాలు చేశారు. రాజధాని ప్రాంతం నుంచి హైకోర్టు తరలిపోతే కోస్తా జిల్లాల కక్షిదారులు పలు ఇబ్బందులకు గురవుతారని వారు తెలిపారు. కక్షిదారులు కూడా న్యాయ సమ్మతంగా చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.