ఏపీ రైతులకు జగన్ షాక్...?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన నవరత్నాల్లో మరో హామీ..కీలకమైన రైతు భరోసా పధకం ఆరంభానికి నిర్ణయించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు చేసిన అన్నతాద సుఖీభవను రద్దు చేసారు. అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల హామీ మేరకు రైతులకు రూ.12,500 ఇస్తామని ముఖ్యంత్రి పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో ఈ స్కీం అమలు చేయాల్సి ఉంది. మరి ఏ రైతులకు పథకం ప్రయోజనం అందాలి అనే అంశంపై కసరత్తులు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ అనే స్కీం ద్వారా ఏడాదికి ఒక్కో రైతు కుటుంబానికీ రూ.6వేలు ఇస్తోంది. అందులో ఉన్న షరతులనే రైతు భరోసా పథకానికీ అమలు చెయ్యాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం. అంతే కాదు… వాటితోపాటూ కౌలు రైతుల్ని గుర్తించడానికి మరిన్ని కండీషన్లు కూడా పెట్టబోతోంది. అందువల్ల రైతు భరోసా స్కీం వల్ల ప్రయోజనం పొందే రైతుల సంఖ్య సగానికి తగ్గబోతోంది. ప్రస్తుతం ఏపీలో కౌలు రైతులతో కలిపి 64లక్షల 7వేల మంది ఉన్నారు. వాళ్లందరికీ రైతు భరోసా కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. వాళ్లలో భూమి ఉన్నవారు 48.7 లక్షల మంది రైతులు. భూమి లేని కౌలు రైతులు 15.37 లక్షల మంది. అందరికీ పథకం వర్తించేలా చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు తెస్తున్న రూల్స్ ప్రకారం చూస్తే 36 లక్షల మంది మాత్రమే పథకాన్ని పొందేలా కనిపిస్తోంది.
మరో షాకింగ్ విషయం ఏంటంట ఏపీ ప్రభుత్వం రైతు భరోసా స్కీం కింద ప్రతీ రైతు కుటుంబానికీ ఏడాదికి రూ.12,500 ఇస్తానని ప్రకటించింది. ఇప్పుడు అధికారులు ఏమంటున్నారంటే కేంద్రం పీఎం కిసాన్ స్కీం కింద ఇస్తున్న రూ.6వేలు పోగా మిగతా రూ.6,500 మాత్రమే ఏపీ ప్రభుత్వం ఇవ్వబోతోందని చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం కేంద్రం పథకంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తమకు రూ.12,500 ఇవ్వాల్సిందే అంటున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కోరుతున్నారు.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం… ఏపీలో 42.54 లక్షల మంది రైతులకు తొలి విడతగా రూ.2వేలను వారి ఖాతాల్లో వేసింది. అది ఎన్నికల సమయం. తీరా ఎన్నికలు అయిపోయాక రెండో విడత సాయాన్ని 33.21 లక్షల మంది రైతుల అకౌంట్లలో మాత్రమే వేసింది. అంటే 9.33 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టింది. ఇక మూడో విడత సాయంగా 29.45 లక్షల మంది రైతులకే డబ్బు ఇచ్చింది. ఈసారి మరో 3.75లక్షల మందికి ఇవ్వలేదు. ఇలా కేంద్ర ప్రభుత్వం అడ్డమైన రూల్స్ పెట్టి 13న్నర లక్షల మంది రైతులకు పీఎం-కిసాన్ స్కీం కింద డబ్బులు ఇవ్వకుండా మానేసింది. ఈ రూల్సే ఏపీ ప్రభుత్వం కూడా తీసుకుంటోంది కాబట్టి ఏపీలో రైతు భరోసా ఎక్కువ మంది రైతులకు దక్కే అవకాశాలు కనిపించట్లేదు.