తిరుమల: టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. టీటీడీ నిర్ణయించిన విధంగా ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య ఒకరిద్దరు మినహా మిగిలిన సభ్యులు కుటుంబ సమేతంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకుంటారు. బంగారువాకిలి చెంత సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 11 గంటలకు అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ధర్మకర్తలమండలి తొలి సమావేశం నిర్వహిస్తారు.
సమావేశం నేపథ్యంలో దాదాపు 175 అంశాలతో అజెండాను రూపొందించినట్టు తెలిసింది. ప్రధానంగా ఈ నెల 30 నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రధాన చర్చ ఉండనుంది.
ఆ తర్వాత ముడి సరుకుల కొనుగోళ్లపైనా చర్చించి నిధులు కేటాయిస్తూ తీర్మానం చేయనున్నారు.గత ధర్మకర్తల మండలి అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కేటాయించిన రూ.150 కోట్ల నిధుల కుదింపుపైనా బోర్డు తుది నిర్ణయాన్ని వెల్లడించనుంది. తిరుమలలో భద్రతను మరింత పటిష్ఠం చేయటంతో భాగంగా సీసీ కెమెరాల కొనుగోళ్లు, అర్చకుల పదవీ విరమణపైనా సభ్యులు చర్చించనున్నట్టు సమాచారం. ప్రధానంగా రమణదీక్షితుల వ్యవహారంపై సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, తొలిరోజు కావడంతో అంశాలన్నింటిపై చర్చించే సమయం లేకపోవటంతో అజెండాలోని ముఖ్యమైన వాటిపై చర్చజరిపి ఆమోదముద్ర వేయనున్నట్టు టీటీడీ అధికార వర్గాలు తెలిపాయి.