వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని తలమంచిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకొంది. తలమంచి దళితవాడకు చెందిన వైఎస్సార్సీపీ వర్గీయుడు కమతం శివకృష్ణ, అదే ప్రాంతానికి చెందిన టీడీపీ వర్గీయుడు చింతా రవిల మధ్య పాత కక్షలున్నాయి. చింతా రవి పద్మనాభసత్రం విద్యుత్ సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.
తలమంచి గ్రామంలో గత బుధవారం నుంచి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు కమతం శివకృష్ణ ఆధ్వర్యంలో జరుగుతుండడంతో ఆయన ఉత్సవాలు జరుగుతున్న చోటే తన వర్గీయులతో ఉంటున్నాడు. దీన్ని గుర్తించిన చింతా రవి వ్యూహాత్మకంగా తన వర్గీయులతో శివకృష్ణతోపాటు ఆయన వర్గీయులపై శనివారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేశారు. ఉత్సవాలు జరుగుతున్న ప్రాంతంలోనే శివకృష్ణ అతని అనుచరులపై విచక్షణా రహితంగా కత్తులతో విరుచుకుపడి దాడి చేశారు. ఈ దాడిలో శివకృష్ణ గడ్డం మెడ భాగం తెగింది.
వాకాటి మనీంద్రకు తలకు, కమతం మనీంద్ర భుజంపై బలమైన గాయాలయ్యాయి. గడ్డం, గొంతు తెగిన శివకృష్ణను నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కత్తులతో దాడికి పాల్పడ్డ చింతా రవి, ఆయన అనుచరులు చింతా మాధవ్, చింతా ప్రసాద్, చింతా నరేష్, చేవూరు వెంకటేశ్వర్లు, చేవూరు నాగేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.