కృష్ణానది కుడిగట్టు కరకట్టపై లింగమనేని రమేష్ నిర్మించిన భవనాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. సోమవారం ఉదయాన్నే జేసిబిలతో ఈ భవనానికి చేరుకున్న అధికారులు కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందుకే కూల్చివేయక తప్పటం లేదంటూ తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ భవనంలో ప్రతిపక్షనేత చంద్రబాబు అద్దెకు ఉంటున్న విషయం విదితమే. మూడు రోజుల క్రితమే చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటియజమానికి సీఆర్డీఏ నోటీసులు జారీ చేస్తూ, వారం రోజుల్లోగా కట్టడాలను కూల్చివేయాలని, లేదంటే తామే కూల్చివేస్తామంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు కరకట్టపై ఉన్న మరో రెండు నివాసాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం.
కాగా తనకు పంచాయితీ అన్ని అనుమతులు జారీ చేసిందని, తాజాగా పుట్టిన సీఆర్డీఏ అధికారులు తమకు అనుమతులు లేవని నోటీసులు జారీ చేయటంపై తీవ్రంగా మండి పడిన భవన యజమాని రమేష్ వారం రోజులు సమయం ఇచ్చినప్పటికీ హడావిడిగా కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటోందని, పోలవరం ప్రోజక్టు ఎత్తు తగ్గించేందుకు తెలంగాణ సిఎం తో సమావేశ మవుతున్న జగన్ ఆ విషయాలపై జనం దృష్టి మరల్చేందుకు తిరిగి కూల్చివేతని తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు సచివాలయ పరీక్షా పత్రాల లీకేజ్ వ్యవహారంపై కూడా ఇదే తరహా వ్యూహంలో ప్రభుత్వం ఉందన్నది విపక్షాల వాదన.