పోలవరం రివర్స్ టెండరింగ్ ఘన విజయంతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడిందని, ప్రజల దృష్టిని మరల్చేందుకు అర్థంపర్థం లేని ఆరోపణలకు దిగుతోందంటూ అధికార పక్షం ఎదురు దాడి ఆరంభించింది. ఆరోపణలపై చర్యలు పక్కకు పెట్టి, ఏపీలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింతగా దిగజారుస్తోందని విమర్శిస్తు, మరోసారి క్విడ్ ప్రోకో ఆరోపణల అస్త్రాన్ని టిడిపి బయటకి తీసిందని వాదిస్తోంది.
అయితే పోలవరం ప్రాజెక్టులో ఒక్క పనిని కూడా మేఘా ఇంజినీరింగ్ కు కట్టబెట్టకుండానే, మొత్తం పోలవరం ప్రాజెక్టును మేఘా ఇంజినీరింగ్కు కట్టబెడుతున్నారంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలపై అధికార పక్షం భగ్గుమంటోంది. ఇటీవల ఓ టిడిపి నేత విద్యుత్ బస్సుల కొనుగోలు వ్యవహారం పైనా ఆరోపణలు కురిపిస్తున్నారని, పోలవరానికి ఈ బస్సులకి లింక్ పెట్టి చెపుతున్నారని దీనిపై మాకే అర్ధం కాలేదు... ఇక జనాలకు ఏం అర్ధం అవుతుందని వైసిపి చెందిన ఓ ముఖ్యనేత మీడియా ముందు భగ్గుమన్నారు. అయితే మేఘా ఇంజినీరింగ్ వ్యవహారంపై ప్రభుత్వం చూసుకుంటుందని తప్పించుకు పోవటం కొత్త ఆరోపణలకు తెరదీసిందని సొంత పార్టీ వర్గాలే చెపుతున్నాయి.