సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై దాడి అనంతరం వరుసగా ఆరో రోజు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2017 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు సమీక్షిస్తు ధరలు నిర్ణయిస్తున్న నేపథ్యంలో గడచిన ఆరు రోజులలో పెట్రోల్ ధర రూ.1.59 పైసలు, డీజిల్ ధర రూ.1.31 పైసలు పెరిగింది. తాజాగా ఢిల్లీ మార్కెట్లో పెట్రోల్ ధర 27 పైసలు, డీజిల్ ధర 18 పైసలు పెరిగిందని, ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడర్లు చెపుతున్నారు. పెట్రో ఉత్పత్తులపై సుంకాల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడటం లేదని ఇటీవల ప్రధాని చెప్పినప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు మరో రూ.6 పెంచక తప్పదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన సంకేతాలు ఇచ్చినట్లుగా మార్కట్ వర్గాలు చెపుతున్నాయి.
ఈ క్రమంలోనే చిన్న చిన్నగా ధరలు పెంచేందుకు కేంద్రం సిద్దమవుతోందని, సౌదీలో దాడులు ఇందుకు బూచిగా చూపిస్తోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆదివారం హైదరాబాదులో పెట్రోల్ ధర 29 పైసలు పెరిగి రూ.78.26కు, డీజిల్ ధర 23 పైసలు పెరిగి రూ.72.75కు చేరుకుంది. అమరావతిలో పెట్రోల్ 27 పైసలు పెరిగి రూ.77.94, డీజిల్ 22 పైసలు పెరిగి రూ.72.10కి పెరిగింది. విజయవాడలో పెట్రోల్ ధర 28 పైసలు పెరిగి రూ.75.58, డీజిల్ ధర 22 పైసలు పెరిగి రూ.71.76గా ఉంది. దాదాపు అన్ని నగరాల్లోను అటు ఇటుగా ఇంతే పెరిగింది.