బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఆలయ నాలుగు మాడ వీధులలో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దుతున్నారు. గ్యాలరీలలో వేచివుండి భక్తుల సౌకర్యార్థం తాగునీటి కొలాయిలు, మరుగుదొడ్ల మరమ్మత్తులు పూర్తి చేశారు. భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీలల్లోకి ప్రవేశించేందుకు, తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారీకేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు. స్వామి పుష్కరిణి చుట్టు నూతనంగా రాతి స్తంభాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇత్తడి గ్రీల్స్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమలలోని రహదారులు, రెండు ఘాట్ రోడ్లకు మరమ్మత్తులు, రోడ్లకు ఇరువైపులా ట్రాఫిక్ నిబంధనలు తెలిపే పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. తిరుమల, తిరుపతిలోని అలిపిరి వద్ద అదనంగా వాహనాల పార్కింగ్ స్థలం అభివృద్ధి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు.