అధికార వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఇప్పటి వరకు కనిపించని విభేదాలు ఆదివారం మీడియా సాక్షిగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మేడికొండూరు మండలం తురకపాలెంలో మసీదు శంకుస్థాపన కోసం వెళ్లారు. అయితే అక్కడ , చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజనీ కూడా దర్శనమివ్వటంతో అవాక్కయ్యారామె. తమకున్న పరిచయాలతోనే ఎమ్మెల్యే రజనీని ఆహ్వానించామని నిర్వాహకులు చెపుతున్నా, మాట మాత్రంగా కూడా తనకు చెప్పకుండా తన నియోజకవర్గం పరిధిలోని కార్యక్రమానికి రజనీ రావడంపై ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కానీ తనకు ఆహ్వానం అందటం వల్లే వచ్చానని, ఇక్కడి ఎమ్మెల్యేతో తిట్టించుకోవటానికి రాలేదంటూ రజనీ నోటికి పనిచెప్పారు. ఇలా ఇద్దరు మహిళాఎమ్మెల్యేలు ఒకే పార్టీలో ఉన్నవారైనా, ఇలా మీడియా ముందే ఒకరిపై ఒకరు చిర్రుబుర్రులాడటంపై నొసళ్లు నొక్కుకోవటం జనం వంతైంది. అయితే ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. ఎమ్మెల్యే శ్రీదేవి కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయి ముస్లింలను అవమానించారంటూ స్థానికులు విమర్శిస్తుండగా స్థానిక ఎమ్మెల్యే వెళ్లిపోయినా సహనంతో మసీదు శంకుస్థాపన కార్యక్రమాన్ని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీ కొనసాగించడం విశేషం. ఇలా ఆరంభమైన ఫైటింగ్ ఇక్కడితో ఆగిపోతుందా? లేక అధిష్టానానికి ఫిర్యాదులు వరకు వెళుతుందా చూడాలి. అదండీ విషయం.