అమరావతి: గ్రామ, వార్డు వాలంటీర్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టామని ఏపీ ప్రభుత్వం చెప్పుకొచ్చినా ఏ గ్రామంలో చూసినా వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్ల ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించి భారీగా హడావుడి కూడా చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఆ పార్టీ ముఖ్యనేత. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఓ పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన విజయసాయి వాలంటీర్లలో తొంబై శాతం ఉద్యోగాలు మన కార్యకర్తలకే ఇచ్చి న్యాయం చేశామని.. సచివాలయ ఉద్యోగాలలో కూడా మన వాళ్ళు కూడా ఎంపికయ్యారని.. ఇదే మాదిరి భవిష్యత్ కూడా మన కార్యకర్తలకు న్యాయం చేస్తామని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో ఇంటర్వ్యూల పేరుతో హడావుడి చేసి నిరుద్యోగులను మోసం చేయడం ఎందుకని దుమారం రేగుతుంది.