పశుసంవర్థక, మత్స్య శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పశువులకు కూడా హెల్త్కార్డులు జారీ చేయాల్సిన ఆవశ్యకవత ఉందన్నారు. దీనివల్ల క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘పశువుల పెంపకంలో సంప్రదాయ పద్ధతులకు పెద్దపీట వేయాలి. ఏ కార్యక్రమం చేపట్టినా వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలి. పశువుల మందుల కొనుగోలులో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలి. ఏపీకార్ల్కు నేరుగా నీటిని తెప్పించుకునేలా నీటిపారుదల శాఖతో మాట్లాడాలి. దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని పేర్కొన్నారు. ఏపీ కార్ల్ను లక్ష్యాలకు అనుగుణంగా నడపాలని ఆదేశించారు. అదే విధంగా….పులివెందులలో ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికోసం బ్రీడింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కరువు పీడిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్య లేకుండా చేయడానికి స్థిరమైన, శాశ్వతమైన విధానాలు తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దాణా కొరత రాకుండా ఉత్తమ విధానాలు అనుసరించాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి పశువుల వైద్యంకోసం 102 వాహనాలు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధంచేయాలని’ సీఎం జగన్ ఆదేశించారు.