రివర్స్ టెండరింగ్ పై తాజాగా మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వ ధనం ఆదా అయితే స్వాగతించాల్సిన విషయమన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం మంచిదేనని చెప్పారు. రివర్స్ టెండర్లలో పాత కాంట్రాక్టర్లకే మళ్లీ దక్కడం సంతోషమని వ్యాఖ్యానించిన జేసీ దివాకర్ రెడ్డి ప్రభుత్వం, కాంట్రాక్టరు కుమ్మక్కయితే అది తప్పు అని చెప్పారు. ఈ పనిలో నష్టమొచ్చినా… మరో పనిలో సర్దుతామని కాంట్రాక్టరుకు ప్రభుత్వం చెప్పినా దానిని తప్పుపట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. ‘తక్కువ ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించడం మంచి పరిణామమే. ప్రజాధనం ఎవరు ఆదా చేసినా స్వాగతించాల్సిందే. ప్రభుత్వం-కాంట్రాక్టర్లు కుమ్మక్కైతే మాత్రం తప్పు. ఈ పనిలో నష్టమొచ్చినా.. ఇంకో పనిలో సర్దుతామని ప్రభుత్వం అనుకుంటే మాత్రం అది తీవ్రమైన తప్పే. రివర్స్ టెండర్లలోనూ పాత కాంట్రాక్టర్లకే పనులు దక్కడం సంతోషం. డబ్బులు మిగుల్చుతామనే పేరుతో సంవత్సరాలు గడిపేయడం మంచిది కాదు’ అని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.