టిడిపి మాజీ ఎంపీ శివప్రసాద్ మరణ వార్త చాలా బాధ కలిగించిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ‘‘నేను, శివప్రసాద్ హైస్కూల్ విద్యను కలిసే చదువుకున్నాం. శివప్రసాద్ను నేనే రాజకీయాల్లోకి ఆహ్వానించాను. శివప్రసాద్ టీడీపీకి చేసిన సేవలు మరువలేనివి. ప్రజా సమస్యలపై శివప్రసాద్ తిరుగులేని పోరాటం చేశారు. శివప్రసాద్ ఆశయాలను కొనసాగిస్తాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
అంతకు ముందు శివప్రసాద్ సతీమణికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. శివప్రసాద్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ రాణించారని కొనియాడారు. శివప్రసాద్ మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని, చిరకాల స్నేహితుడిని కోల్పోయానని శివప్రసాద్ భార్యతో చంద్రబాబు చెప్పారు. శుక్రవారం శివప్రసాద్ను పరామర్శించేందుకు చంద్రబాబు చెన్నై వెళ్లిన విషయం తెలిసిందే. శివప్రసాద్ను పరామర్శించారు. శివప్రసాద్ కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యానిచ్చారు.