మాజీ మంత్రి అఖిలప్రియ బీజేపీలో చేరుతారని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం తెలిసిందే. అయితే శనివారం మధ్యాహ్నం ఆమె కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో హైదరాబాద్ లో భేటీ కావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలప్రియ ఓడిపోయారు. కొద్దిరోజుల పాటు వైసీపీలోకి వెళ్తారని ప్రచారం జరిగినా ఆమె పార్టీని వీడలేదు. గతంలో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవి పొందిన ఆమె, ఇప్పుడు మళ్లీ వైసీపీలోకి వెళ్తే అంత పలుకుబడి ఉండదని భావించి వెళ్లలేదనే వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో బలంగా పుంజుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ కీలక నేతలను చేర్చుకునేందుకు ప్లాన్ వేస్తుంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలను చేర్చుకుని దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో అఖిలప్రియ పార్టీ మారుతారని ప్రజారం జరుగుతున్న నేపథ్యంలో అఖిలప్రియ కిషన్ రెడ్డిని కలవడం మళ్లీ చర్చకు దారి తీసింది.
బీజేపీలో చేరేందుకే కిషన్ రెడ్డిని కలిసారని, దసరా తర్వాత చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె సన్నిహితులు మాత్రం వేరేలా చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలపై ఫిర్యాదు చేసేందుకే కిషన్ రెడ్డిని కలిసారని, ఆమె టీడీపీలోనే కొనసాగుతారని అంటున్నారు.