తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు మునిగిపోయిన ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఇప్పటికీ కొన్ని మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటరమణతో పాటు మరో ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంపచోడవరం ఏఎస్పీ వకుళ్ జిందాల్ బోటు యజమాని వెంకటరమణను మీడియా ముందు ప్రవేశపెట్టారు. గోదావరి నదిలో సుడిగుండాల నుంచి తప్పించుకోలేక బోటు నీట మునిగిన సంగతి తెలిసిందే. బోటు 200 అడుగుల లోతున ఉన్నట్టు గుర్తించినా, దాన్ని బయటికి తీసుకురావడంలో నిపుణులు సైతం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.